భద్రాద్రి కొత్తగూడెంలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

  • దేవెళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఘటన
  • కొనసాగుతున్న ఎదురుకాల్పులు
  • నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీజీపీ పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టుల సంచారం గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. పోలీసులను చూసిన మావోలు కాల్పులు ప్రారంభించగా, అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.

మరోవైపు, డీజీపీ మహేందర్‌రెడ్డి నిన్న మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. జులై 17న ఆసిఫాబాద్ వచ్చిన డీజీపీ నెలన్నర వ్యవధిలోనే మరోమారు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, తొలుత ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ పాలనాధికారి సందీప్ కుమార్ ఝా, ఇన్‌చార్జ్ ఎస్పీ సత్యనారాయణతో సమావేశమయ్యారు. అనంతరం ఆదిలాబాద్ ఎస్పీ విష్ణువారియర్‌తో కలిసి హెలికాప్టర్‌లో ప్రాణహిత నది పరీవాహక ప్రాంతం, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఏరియల్ సర్వే నిర్వహించారు.

Bhadradri Kothagudem District
Maoists
Encounter
Telangana

More Telugu News